వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి
షర్మిల తన పాదయాత్రకు మరో రోజు విరామం ప్రకటించారు. ఆమె కుడికాలు
మోచిప్పకైన గాయం నొప్పి తీవ్రం కావడంతో విశ్రాంతి తప్పనిసరి అని
ఆర్థోపెడిక్ వైద్యులు సూచించారు. ఆదివారం ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్
విద్యాసాగర్, సీఎస్ రెడ్డి, శివభారత్ రెడ్డి ఆమెను వేర్వేరుగా
పరీక్షించారు. ఈ గాయాన్ని వైద్య పరిభాషలో లిగ్మెంట్ ఇంజురీ అంటారని సీఎస్
రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని బస కేంద్రంలో ఉన్న
షర్మిలను ఆదివారం దిల్సుఖ్నగర్ కోనార్క్ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేశారు. స్కానింగ్ రిపోర్టులు సోమవారం
అందుతాయని వైద్యులు తెలిపారు. ఇందువల్ల సోమవారం కూడా పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇదిలా ఉంటె 900 కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర
పూర్తి చేశారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్న షర్మిల పాదయాత్ర
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఆగింది .ఇడుపుల పాయ నుండి ఇచ్చాపురం
వరకు మూడు వేల కిలోమీటర్లకుపైగా మహాపాదయాత్రను చేపడుతున్న షర్మిల 900
కిలోమీటర్లమేర పాదయాత్రను పూర్తి చేశారు .అలుపెరుగకుండా షర్మిల గత 60 రోజుల
నుండి కడప , అనంతపురం , కర్నూలు ,మహబూబ్నగర్ జిల్లాలలో విస్తృతంగా
పాదయాత్ర చేసి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కు చేరుకున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, మైనార్టీలు,
రైతులు, విద్యార్థులతో పాటు వివిధ వర్గాల ప్రజలతో మమేకమై ఉత్సాహంగా
సాగుతున్నారు.
మరోవైపు
ప్రధాన ప్రాంతాలలో జరుగుతున్న బహిరంగ సభలలో షర్మిల పాల్గొంటున్నారు.
ముఖ్యంగా మహిళలతో రచ్చబండలను నిర్వహిస్తున్న షర్మిల.. వారి సమస్యలను అడిగి
తెలుసుకుంటున్నారు. గ్యాస్ కష్టాలు ,విద్యుత్ సర్ చార్జీల పెంపు,
తదితర అంశాలపై ప్రభుత్వవైఖరిని తూర్పారపడుతూ ఆమె ప్రసంగాలు సాగుతున్నాయి. అదే సమయం లో వైఎస్
హయాంలో జరిగిన మేలును కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు .దేశ చరిత్రలో
ఏమహిళ చేపట్టని రీతిలో మూడు వేల కిలో మీటర్ల పాదయాత్రను షర్మిల చేపట్టారు. ఇప్పటికే 900 కిలోమీటర్లకుపైగా
పాదయాత్ర పూర్తి చేసిన ఆమె సగటున 14 నుండి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర
కొనసాగింది. మరో మూడు రోజులు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రపూర్తి చేసి
నల్గొండ జిల్లాలో ప్రవేశించనున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్తు
అవసరమో, ఏ జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు
ఉత్పత్తి అవుతుందో, ఇంకా ఎంత అవసరమవుతుందో వేళ్ల మీద లెక్క వేసి
చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. అలంపూర్ నియోజకవర్గంలోజరిగిన పాదయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఇప్పటి పాలకులకు అసలు ఏ ప్రాజెక్టు ఎక్కడ
ఉందో కూడా తెలియదని ఘాటుగా విమర్శించారు. ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు
తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్(రాజోలి డైవర్షన్ స్కీం)కు నీళ్లు వచ్చేవి. జల
సమస్య ఉంటే నాన్నకర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి
అవసరమైతే పోలీసు బలగాలను పెట్టి రాజోలి బండకు నీళ్లు తెచ్చేవారు.
వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకునే
వాళ్లే కరువవడంతో ఈ ప్రాంత పంటలకు నీళ్లు రాకుండా పోయాయి’’ అని షర్మిల
ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం
పెట్టకుండా ఇంకా ఎంతకాలం సాగదీస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ను
ఆమె ప్రశ్నించారు.
వైఎస్ జగన్ సోదరి షర్మిల
చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కర్నూలు జిల్లా
నుంచి మహబూబ్నగర్ జిల్లాలో అడుగిడింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు
విజయమ్మ, షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు.తెలంగాణ
ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు దివంగత వైఎస్
చిరకాల స్వప్నాల్లో ఒకటని,ఆయన మరణించాక ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే
ఆగిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మానవపాడు మండలం
పుల్లూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ, షర్మిల మాట్లాడారు. తెలంగాణ
సాధన కోసం టీఆర్ఎస్కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే..
వాళ్ల మనోభావాలను గౌరవించాలని చెప్పి ఉప ఎన్నికల్లో జగన్ ఆ ఆరు
స్థానాల్లో పోటీ పెట్టలేదు అన్నారు
‘‘తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలకు నా సలాం.. నా పాదం
మోపిన పవిత్ర తెలంగాణ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా.. ప్రతి తెలంగాణ ఇంటిని
జగనన్న సంతోషంగా ఉంచుతాడు. నా అక్కలకు చెల్లెలకు, తెలంగాణసోదరులకు ఒక్క
మాట చెప్తున్నా.. మీరు ప్రాణ త్యాగాలు చేసుకోవద్దు. మీ ప్రాణాలు
ఇవ్వకుండా.. అందరం కలిసి తెలంగాణను నిలబెట్టుకుందాం’’ అని షర్మిల తెలంగాణ
ప్రజలను కోరారు. ‘‘వైఎస్సార్కు తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఏ
పథకం ప్రారంభించినా తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. జలయజ్ఞం, రూ.2 కిలో
బియ్యం, రుణ మాఫీ, ఉచిత విద్యుత్తు, అన్ని పథకాలను ఆయన తెలంగాణ నుంచే
ప్రారంభించారు.’ అని షర్మిల పేర్కొన్నారు.పార్టీ అంచనాలను మించి స్పందన లభించడంతో వై సి పీ నేతలు ఉత్సాహంతో వున్నారు.
షర్మిల తనతోపాటు ఇడుపులపాయ నుంచి కాలినడకన వస్తున్న వారి అభిప్రాయాలు
తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని నాగులాపురం వద్ద
చెట్టుకింద రాళ్లపై కూర్చొని తనతో ఎందుకు రావాలనిపించిందో వారిని అడిగి
తెలుసుకున్నారు. వీరితోపాటు అనేక మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన ప్రమీల అనే మహిళ వైఎస్ సీఎం అయిన తర్వాత
సొంతిల్లు కట్టుకున్నారు. రూ.60 వేల రుణం మాఫీ అయింది. దీంతో ఇప్పుడు తన
కొడుకుతో కలిసి పాదయాత్ర చేస్తోంది. ప్రకాశం జిల్లా గురువారెడ్డి పాలెంకు
చెందిన 55 ఏళ్ల రమణమ్మ రాజన్నపై అభిమానంతో మరో ఏడుగురు తన ఊరి వాళ్లను
తీసుకొచ్చి మరీ పాదయాత్రలో ఇడుపుల పాయ నుంచి నడిచి వస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన చెన్ను విజయ అనే గృహిణి తన కుమారుడిని రెసిడె
న్షియల్ స్కూల్లో చేర్పించి షర్మిలతో పాదయాత్ర చేస్తుంటే.. వైజాగ్కు
చెందిన పేరిచర్ల ఝాన్సీ జగన్ కుటుంబంపై అభిమానంతో ప్రతి జిల్లాలో
రెండ్రోజులు షర్మిల వెంట నడుస్తున్నారు. జగన్ మీద అభిమానం పెంచుకున్నందుకు
మహిళా గ్రూపు నుంచి తన తల్లిపేరు తీసివేయడంతో అక్కతో కలిసి నడవాలని
వచ్చినట్లు రాఘవేంద్ర అనే యువకుడు చెప్పాడు. ఇలాగే గుంటూరుకు చెందిన చింతా
సుబ్బారెడ్డి, కోడూరు వాసి కృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాసి
జ్యోతుల నవీన్ ఆయన స్నేహితులు, కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి,
కడప నుంచి రాజగోపాల రెడ్డి, మాచ్చవరానికి చెందిన గజ్జెల వెంకట
కృష్ణారెడ్డి, అనంతపురానికి చెందిన వన్నూరమ్మ, కడప నుంచి షఫీ, ధర్మవరం
నుంచి నారాయణ, కోడుమూరు నుంచి శ్రీనివాస యాదవ్, కడప నుంచి సరస్వతి... ఇలా
ఒక్కొక్కరు ఒక్కోరకంగా వైఎస్ కుటుంబానికి అభిమానులుగా మారారు. అదే
అభిమానంతో జగన్ను సీఎంగా చూడాలన్న లక్ష్యంతో అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి
పాదయాత్ర చేసుకుంటూ కర్నూలుకు వచ్చారు. షర్మిలతో కలిసి ఇచ్ఛాపురం వరకు 3
వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామని చెబుతున్నారు.
జగన్ సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం(ఈ నెల 22వ తేదీ)
మహబూబ్నగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. మధ్యాహ్నం 1 గంటకు తుంగభద్ర
బ్రిడ్జి వద్ద షర్మిల మహబూబ్నగర్లో అడుగుపెడతారని జిల్లా పార్టీ కన్వీనర్
ఎడ్మ కృష్ణారెడ్డి, సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్రెడ్డి, పాదయాత్ర సమన్వయ
కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా
ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలకడానికి సంసిద్ధులవుతున్నారని చెప్పారు.
జిల్లాలో ఏడు జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 225 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర
కొనసాగుతుందని పేర్కొన్నారు.
‘‘ చంద్రబాబు గారూ .. మీ కుమ్మక్కు రాజకీయాలు చూడలేక, మీ మీద నమ్మకం
లేకనే మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు. వాళ్లకు
మనస్సాక్షి ఉంది కాబట్టే.. నిజాయతీ పక్షాన నిలబడాలనుకున్నారు. అందుకే..
జగనన్నకు అండగా నిలబడుతున్నారు. జీవితంలో ఏనాడూ నిజం మాట్లాడలేని మీరు ఈ
నిజాన్ని దాచిపెట్టి మేం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నామని అబద్ధపు
ప్రచారం చేస్తున్నారు." అని షర్మిల అన్నారు . ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 33వ రోజు సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరు
నియోజకవర్గంలో సాగింది. జగన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ
కేసులు బనాయించి జైల్లో పెట్టినందుకు నిరసనగా గూడూరులో వేలాది మంది ప్రజలు
నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిల పాదయాత్రలో కదంతొక్కారు. గూడురు సభలో ఆమె
ప్రసంగిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబు ఆదివారం
చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. " మాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన
అవసరం లేదు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అనుభవం.. రహస్య ఒప్పందాలు చేసుకునే
చరిత్ర మీకే ఉంది., పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్లో బంధించావు.
కొందరిని బెదిరించావు, కొందరిని కొన్నావు. ఇదేనా మీ పరిపాలనా దక్షత?’’ అని షర్మిల బాబుపై నిప్పులు
చెరిగారు.
‘ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల స్వప్నాల్లో ఒకటైన హంద్రీ-నీవా
ప్రాజెక్టు ఇవాళే ప్రారంభించిన సీఎం
కిరణ్ అందరి పేర్లూ
చెప్పారట.. కాని 4 వేల కోట్లు ఖర్చు చేసి 95 శాతం పనులు పూర్తి చేసిన
వైఎస్సార్ పేరు మాత్రం ఒక్కసారంటే.. ఒక్కసారి కూడా ప్రస్తావించలేదట.
మంచితనాన్ని గుర్తు పెట్టుకోవడం సంస్కారం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించే
వ్యక్తికి ఆమాత్రం సంస్కారం లేకపోవడం దురదృష్టకరం. ఆ ప్రాజెక్టు
ప్రారంభించినపుడు.. గలగలా నీళ్లు పారినప్పుడైనా వైఎస్ గుర్తురాలేదా మీకు?’’
అని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల.. ముఖ్యమంత్రిని
ప్రశ్నించారు. షర్మిల
చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 32వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా
కోడుమూరు నియోజకవర్గంలో సాగింది. సి.బెళగల్, పొలకల్ గ్రామాల్లో
ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. హంద్రీ-నీవాపై
మాట్లాడుతున్నప్పుడు షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. గుండెల్లో
పెల్లుబుకుతున్న బాధతో ఆమె స్వరం జీరబోయి కొద్దిసేపు మాటలు రాలేదు. భూమా
దంపతులు శోభా నాగిరెడ్డి, నాగిరెడ్డి ఆమెను సముదాయించారు.
‘‘బాబు గారూ! ఇదిగో.. ఈ ప్రజల మాటలు, వాళ్ల గోడు మీకు
వినిపిస్తోందా? ప్రజలకు ఏమీ చేయలేని ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు
కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ పాదయాత్రలో చిత్తశుద్ధి
ఉంటే, నిజంగా మీలో విశ్వసనీయత అనేది ఉంటే వెంటనే అవిశ్వాసం పెట్టండి. కానీ
మీరేమో అవిశ్వా సం పెట్టనుగాక పెట్టను అంటారు. కాబట్టి మేమే అవిశ్వాసం
పెడతాం.. దానికి మీరు మద్దతు ఇస్తారా? సూటిగా చెప్పండి. మీరు ప్రజల పక్షం
ఉంటారో..ప్రభుత్వం పక్షం ఉంటారో తేల్చుకోండి’’ అని జగన్ సోదరి షర్మిల.. టీడీపీ
అధ్యక్షుడికి సవాల్ విసిరారు. ప్రజల కష్టాలు పట్టించుకోని సర్కార్ , దానికి వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ వైఖరులకు నిరసనగా
జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర
31వ రోజు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల
పరిధిలో సాగింది. తిమ్మాపురం గ్రామంలో షర్మిల రచ్చబండ మీద మహిళలతో కలిసి
కొద్దిసేపు ముచ్చటించారు. ‘అమ్మా.. బోరులో నీళ్లు తోడుకొని తాగుదామన్నా
కరెంటు ఉండటం లేదు.. తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉంది. వానలు లేక పంటలు
ఎండిపోయినయ్.. నష్ట పరిహారం ఇస్తామన్నారు కానీ ఇంత వరకు లేదు. జ్వరం వస్తే
పస్తులు పడుకుంటున్నాం.. మొన్ననే చంద్రబాబు గారి పాదయాత్ర మా ఊరి నుంచే
పోయింది. ఆయనకూ మా బాధలు చెప్పినం. ఇది పనికిరాని ప్రభుత్వం..
కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించితే మీకు మేలు జరుగుతుంది
అన్నారు.. బాబుగారు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని టీవీల్లో
చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బాబుగారు కూలగొట్టడం లేదమ్మా’’
అని ఇదే గ్రామానికి చెందిన వెన్నెల మహిళా గ్రూపు సభ్యులు తోడేళ్ల
రామలింగమ్మ, నర్సమ్మ షర్మిలను అడగటంతో షర్మిల పై విధంగా స్పందించారు.
ఇంటర్మీడియెట్ పాసై పేదరికంతో డిగ్రీ చదవలేక కూలీ పనులకు వెళ్తున్న
బాలికను షర్మిల అక్కున చేర్చుకున్నారు. తిరిగి కాలేజ్కు వెళ్లి చదువుకుంటే
ఖర్చులు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన
విరూపాక్ష గౌడ్ కూతురు చంద్రకళ ఇంటర్మీడియెట్ సీఈసీలో ఉత్తీర్ణత సాధించారు.
పేదరికంతో చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. పత్తి చేలో పత్తి
తీస్తున్న వారిని షర్మిల పలకరించారు. పేదరికంతో తాను ఉన్నత చదువుకు
దూరమయ్యానని, ఇవ్వాళ వైఎస్సార్ బతికే ఉంటే తాను ధైర్యంగా డిగ్రీ
చదివేదానినని చంద్రకళ చెప్పారు. ఆ బాలిక మాటలకు స్పందించిన షర్మిల చదువు ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు.
"రాజశేఖరరెడ్డి ఏ పథకం తెచ్చినా ఇందిరాగాంధీ అని, రాజీవ్ గాంధీ అని వాళ్ల
పేర్లే పెట్టాడు. అందుకు బహుమానంగా ఆయన పేరును దోషిగా
ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇది అన్యాయం కాదా? ఇది వెన్నుపోటు కాదా" అని
అడుగుతున్నా.ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చి.. మీ
గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రెక్కల కష్టం
మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. రాష్ట్ర ప్రజలందరి
మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే
లేదు..’’ అని షర్మిల విమర్శించారు.చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు
ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని
చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక
వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర
అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి అదే గ్రామాల
మీదుగా వెళుతూ ఇప్పుడు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు.
నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రజలు అమాయకులు కాదు.
చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’’ అన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా
ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి
చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని
దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ
ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు..’’ అని షర్మిల మండిపడ్డారు.
మరో ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 30 రోజులు. ఈ 30 రోజుల్లో షర్మిల
దాదాపు15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రచ్చబండలు నిర్వహించారు. చెట్ల
కింద నుంచోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాన, ఎండ, చలిలోనూ పాదయాత్ర
ఆపలేదు. జ్వరంలోనూ ముందుకు కదిలారు. కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు.
నీచ రాజకీయాలను కడిగిపారేశారు. అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర డ్రామాలేంటీ
అంటూ ప్రశ్నించారు. 30 రోజుల్లో 375.3 కిలో మీటర్లు నడిచారు షర్మిల. కుమ్మక్కు
కుట్రలకు నిరసనగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్ను
వ్యతిరేకిస్తూ ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రజలు అక్కున
చేర్చుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని నిలబెట్టుకుంటేనే తమ బతుకులు
నిలబడేదంటూ షర్మిల అడుగులో అడుగేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల
నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఆరు రోజుల
తర్వాత అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది.
అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర రాప్తాడు, ఉరవకొండ,
గుంతకల్ నియోజకవర్గాల్లో 195 కిలో మీటర్లు పాటు సాగింది. నవంబర్ 8న
కర్నూలు జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం అడుగు పెట్టింది. మద్దెకెర నుంచి
కర్నూలు జిల్లాలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని,
మంత్రాలయంల మీదుగా ముందుకు కదులుతోంది. ఈ 30 రోజుల పాదయాత్రలో షర్మిల అనేక
సమస్యలను తెలుసుకున్నారు . రైతులకు ధైర్యం చెప్పారు. తెలంగాణలో కూడా మరో
ప్రజా ప్రస్థానానికి అదిరిపోయే స్పందన వస్తుందని నేతలు ఆ ప్రాంత నేతలు
చెప్పారు. పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్
కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ఆ ప్రాంత ప్రజలు
ఎదురుచూస్తున్నారని తెలిపారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం
పాదయాత్ర ఈ 22న మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. అలంపూర్ నియోజకవర్గం
పుల్లూరులో తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. పాదయాత్రను విజయవంతం
చేసేందుకు మహబూబ్నగర్ జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను
నియమించారు. షర్మిల జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లక్షమందితో స్వాగతం
పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మహబూబ్నగర్ తర్వాత రంగారెడ్డి,
నల్గొండ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ హయాంలో మొదలై, ప్రస్తుతం
ఆగిపోయిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు. మొత్తం ఏడు నియోజకవర్గాల
మీదుగా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని తెలంగాణ జిల్లాల రీజనల్
కోఆర్డినేటర్, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి
గోవర్థన్ చెప్పారు.
"గ్యాస్ మీద భారం మోపి ఈ
ప్రభుత్వం పిల్లల కడుపుమీద కొడుతోంది....హాస్టల్లో నెలకు 18 చొప్పున ఏడాదికి 216 సిలిండర్లు దాకా వాడాల్సిన
అవసరముంటే.. వాటిలో ఆరు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుందట. మిగిలినవి
ఒక్కో సిలిండరూ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట. ఎంత అన్యాయమిది? అసలే
పిల్లలకు రోజుకు రూ.17 మాత్రమే
భోజనానికి వెచ్చిస్తుంటే.. ఇప్పుడు గ్యాస్ పేరుతో ఆ భోజనంలో కూడా కోత
పెట్టే పరిస్థితి. రూ. 17తో అసలు పిల్లలకు రెండు పూటలా భోజనం ఎలా
సరిపోతుంది? జైల్లో ఖైదీలకు కూడా రూ. 45 వెచ్చిస్తుంటే.. పిల్లలకు రూ. 17
మాత్రమేనా? ఇది అన్యాయం కాదా? అసలు కిరణ్కుమార్రెడ్డి ఇంటికి ఎన్ని
సిలిండర్లు వెళుతున్నాయో కనుక్కోవాలి..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నేత షర్మిల మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసి కుమ్మక్కైన
కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలకు నిరసనగా
జగన్ తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 29వ రోజు
గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో సాగింది. పెద్దకడబూరు
దాటాక క స్తూర్బా బాలికల విద్యాలయంలో షర్మిల విద్యార్థినులతో
మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు ఉండడం లేదని, కాంపౌండ్ వాల్
లేదని, ప్లేగ్రౌండ్ లేదని, గ్యాస్ ధర పెరిగిందంటూ మెనూలో కోతపెడుతున్నారంటూ
విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన షర్మిల గ్యాస్ పేరుతో
పిల్లల పొట్ట మీద కొట్టడం అమానవీయమని అన్నారు. పాలు, గుడ్లు, అల్పాహారం
అందుతున్నాయా? అని అడగడంతో పాలు ఇవ్వరని, గుడ్లు వారానికి మూడు ఇస్తారని
విద్యార్థినులు తెలిపారు. పదో తరగతితో ఆపకుండా పెద్ద చదువులు చదవాలని,
జగనన్న సీఎం అయ్యాక ఎంత పెద్ద చదువైనా ఉచితంగా చదివిస్తాడని షర్మిల వారికి
భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్తో మాట్లాడి క్రీడామైదానం
వచ్చేలా చూస్తారని షర్మిల హామీ ఇచ్చారు.గురువారం యాత్రలో ఉదయం రంగాపురం
శివారులో బయలుదేరిన షర్మిలకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజానీకం అడుగడుగునా
బ్రహ్మరథం పట్టింది.
‘‘మాలాంటి వారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు
తెలుసుకోవడంలో అర్థం ఉంది.
కానీ చంద్రబాబుకు పాదయాత్ర ఎందుకు? ఆయనకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు
ఉన్నారు. ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి
దించేయొచ్చు.. కానీ దించేయరట."ఆదోని పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభ లో
షర్మిల మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఎంఐఎం కూడా
కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు
వెనక్కి తీసుకుంది. ఇప్పుడు
అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ సర్కార్ ను కూలదోయడం చాలా సులభం. ప్రతిరోజూ
అడుగుతూనే ఉన్నాం.. నిలదీస్తూనే ఉన్నాం.కానీ టీడీపీ అవిశ్వాసం
పెట్టదట! పేరుకు మాత్రం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదంటూ చంద్రబాబు తిడుతూనే
అదే ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారారు..
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయని
ధ్వజమెత్తారు. కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదన్న మాట నిజమే అయితే..
తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి తన నిజాయతీని రుజువు చేసుకోవాలని
డిమాండ్ చేశారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టరని.. ఆయనకు తెలిసిందల్లా
అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు రాజకీయాలు చేయడమేనని ఎద్దేవా చేశారు.
‘‘ఇచ్చే నాలుగు గంటల కరెంటుకు రూ.250 బిల్లు వేస్తున్నారట! మూడేళ్లలో
మూడుసార్లు చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వం.. మూడేళ్ల కిందటి సర్చార్జీలు
ఇప్పుడు వసూలు చేస్తూ పేదోళ్ల బతుకుల్లో చీకటి నింపుతోంది. రాజశేఖరరెడ్డి
ఉన్నప్పుడు విద్యుత్తు కోతల్లేకుండా కరెంటు బిల్లు రూ.50 వస్తే.. ఇప్పుడు
మొత్తం కోతలతోనే రూ.250 రావడం ఏ రకంగా న్యాయం. ఇది రాబందుల రాజ్యం
కాదా..?’’ అంటూ
జగన్ చెల్లెలు షర్మిల రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు.
బస్ చార్జీలు, కరెంటు చార్జీలు, గ్యాస్ చార్జీలు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం
సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు
అవసరాలను ముందే ఊహించి కొనుగోలు చేసేవారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం
నిద్రపోతున్నారన్నారు.
కర్నూలు జిల్లా బిణిగేరకు చెందిన సుమలత అనే పదేళ్ల చిన్నారి వాళ్ల
నాయనమ్మతో కలిసి షర్మిలను చూసేందుకు వచ్చింది. స్కూలుకు వెళ్తున్నావా
చిన్నా అని షర్మిల అడగగా ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఐదో తరగతి వరకు
చదువుకున్నానని, ఈ ఏడాదే చదువు మానేశానని, తల్లిదండ్రులిద్దరూ బండలు కొట్టే
పనిచేస్తారని, తనను చదివించలేరని ఏడ్చింది. దీంతో చలించిపోయిన షర్మిల...
పాప, నాయనమ్మల కన్నీళ్లు తుడుస్తూ "నేను చదివిస్తానమ్మా" అంటూ ఓదార్చారు.
ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మనూరు జయరాం ఆ పాపను చదివించేందుకు
ముందుకొచ్చారు. పాపను స్కూల్లో చేర్పిస్తానని మాటిచ్చారు.
‘‘ఫ్యాక్షన్
గొడవల్లో మా నాన్నను చంపేశారు. మా అమ్మ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది.
ఇల్లు గడవక మా అమ్మ మమ్ములను స్కూలు మాన్పించింది. మేం ఏ గ్రేడ్
స్టూడెంట్లం. మాకు చదువుకోవాలని ఉంది..’’ అంటూ ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ
చెప్పడంతో షర్మిల చలించిపోయారు. వెంటనే పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని
‘‘ఏడ్చొద్దు తల్లీ! మీ ఇద్దరినీ చదివించే బాధ్యత నాది.. మీ చదువు పూర్తయ్యే
వరకు నేను చూసుకుంటా’’ అని వారికి హామీ ఇచ్చారు. పత్తికొండలో షర్మిల బస
చేసిన క్యాంప్ వద్దకు పదేళ్ల రాశి, ఆ పాప తమ్ముడు సురేంద్ర
వచ్చారు. షర్మిలక్కను కలవాలంటూ సెక్యూరిటీ వారికి చెప్పి అక్కడే
కూర్చున్నారు.
అది చూసిన పుట్టపర్తి నియోజకవర్గం పార్టీ నేత
డాక్టర్ హరికృష్ణ వారిద్దరిని షర్మిల వద్దకు తీసుకెళ్లారు. షర్మిలను
చూడగానే పిల్లలిద్దరు వెక్కివెక్కి ఏడుస్తూ తమ పరిస్థితిని వివరించారు.
తండ్రి హనుమంతు హత్యకు గురైతే తల్లి అనసూయ ఓ ప్రైవేటు క్లినిక్లో
పనిచేస్తూ నెలకు రూ.2,500 సంపాదిస్తుందని, దీంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా
ఉందని పాప రాశి ఏడుస్తూ వివరించింది. దీంతో పాఠశాల చదువు అయిపోయేంత వరకు
చదివించే బాధ్యత తనదేనని షర్మిల హామీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న
పత్తికొండ నియోజకవర్గం నాయకులు నాగరత్నమ్మ, రామచంద్రారెడ్డి, పుట్టపర్తి
నియోజకవర్గం నాయకుడు హరికృష్ణ ఆ పిల్లల బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు.
‘‘మాట ఇచ్చాను. తప్పొద్దన్నా’’ అంటూ షర్మిల ఆ పిల్లలను వారికి
అప్పగించారు. నాగరత్నమ్మ పాప రాశిని కస్తూరిబా పాఠశాలలో చేర్పించే ఏర్పాటు
చేయగా, డాక్టర్ హరికృష్ణ బాబు పాఠశాలకు నెలనెలా ఫీజు చెల్లించేందుకు హామీ
ఇచ్చారు.