Tuesday 6 November 2012

ప్రజలను పట్టించుకునే నాథుడేడి??

పందొమ్మిదో రోజు సోమవారం ఉదయం 10.15కు రాగులపాడులో పాదయాత్రకు బయలుదేరిన షర్మిలకు పందికుంట క్రాస్ సమీపంలో వెంకటాంపల్లి, వీపీపీ తండా, వీపీసీ తండా, జెరుట్ల రాంపురం వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ‘రాజశేఖరరెడ్డి మాకు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేరు. పావలా వడ్డీ రుణాలు రావడం లేదు. తాగేందుకు నీళ్లు లేవు. కరెంటు లేదు. ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారు..’ అని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న సీఎం కాగానే అర్హులందరికీ పెన్షన్లు, రుణాలు ఇస్తారని, అమ్మ ఒడి పథకం అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. అనంతరం తండాల వాసులు షర్మిలకు కొప్పెర(అద్దాల పైట) కప్పి.. కత్తి, డాలు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు. షర్మిల 12 గంటలకు పందికుంట చేరుకుని అక్కడ సభలో మాట్లాడారు. తరువాత మార్గం మధ్యలో రామాంజనేయులు అనే రైతు జొన్న విత్తనాలు వేస్తుంటే.. షర్మిల అక్కడికివెళ్లి వారితోపాటు విత్తనాలు వేశారు. మల్లికార్జున, అంపమ్మ అనే రైతులు తమ వేరుశనగ పంటలో కాయ కాయక నష్టపోయామని తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. మధ్యాహ్నం 3.30కు ఎన్‌ఎన్‌పీ తండా వాసులు తమకు రాజశేఖరరెడ్డి భూములకు పట్టాలు ఇచ్చారని, ఆ తరువాత ఇక పట్టించుకున్న నాథుడే లేరని చెప్పుకొచ్చారు. ‘జగనన్నను ఎప్పుడు ఇడుస్తారమ్మా.. ఇడవకపోతే మేం కూడా ధర్నా చేస్తాం..’ అని గొంతెత్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వర్షం కురవగా వర్షంలోనే వజ్రకరూర్ చేరుకున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం 6.45కు వజ్రకరూర్‌లో ఏర్పాటుచేసిన రాత్రి బసకు చేరుకున్నారు. 19వ రోజు మొత్తం 10.70 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 246.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. సోమవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, తోపుదుర్తి కవిత, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...