20వ రోజు పాదయాత్రలో భాగంగా గూళ్యపాలెంలో జగన్ సోదరి షర్మిల
స్థానికులతో మాట్లాడారు. ఈ
సందర్భంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వ
వైఖరితో విసిగిపోయామన్నారు. ఆల్లె బాషా అనే వికలాంగుడికి 2011 జులై వరకు
పెన్షన్ వచ్చిందని, కానీ 15 నెలలుగా పెన్షన్ రాలేదని ఆయన భార్య
మొరపెట్టుకున్నారు. పెన్షన్కు సంబంధించిన ఖాతా పుస్తకం చూపించి.. తమకు
పెన్షనే ఎంతో కొంత ఆధారమని, వచ్చేలా చూడాలని వేడుకున్నారు. ఓ విద్యార్థి
మాట్లాడుతూ ‘గ్యాస్ ధర పెరిగిందని హాస్టల్లో మెనూ తగ్గించారు. జైల్లో
ఖైదీకి రూ. 40 వెచ్చిస్తే.. మాకు రోజుకు రూ. 17 మెస్ చార్జీగా ఇస్తున్నారు.
రాజన్న రాజ్యం రావాలి. మళ్లీ మాకు జగనన్న సీఎం కావాలి..’ అని అన్నారు.
స్థానికులంతా తమకు నీళ్లు రావడం లేదని, కరెంటు ఉండడం లేదని, పావలా వడ్డీ
కింద రుణాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు.
ఇందిరమ్మ ఇల్లు మధ్యలో
ఆగిపోయి బిల్లులు రాలేదని వాపోయారు. ఓ రైతు మాట్లాడుతూ ‘అదనులో విత్తనాలు
సరఫరా చేయకుండా ఈప్రభుత్వం రైతులను దెబ్బతీస్తోంది. సబ్సిడీ విత్తనాలను
దళారులు చేజిక్కించుకుని అమ్ముకుంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం
యూనిట్గా ఇన్సూరెన్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది..’ అని
పేర్కొన్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ ‘మాకు ఉచిత బస్ పాస్ ఇవ్వడం లేదు..’
అని ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతి
పరీక్షకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా.. షర్మిల స్పందిస్తూ
‘ఇది రాబందుల రాజ్యం అనడానికి చక్కటి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా
ఫీజులు వసూలు చేస్తారు. కరెంటు ఇవ్వరు. గ్యాస్ ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. ఉన్న
పెన్షన్లు తీసేస్తారు. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి
చెప్పండి. జగనన్న వచ్చాక రాజన్న కన్న ప్రతి కలనూ నెరవేరుస్తాడు. మీ
కష్టాలన్నీ తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు.
గుంతకల్లు
నియోజకవర్గంలోకి..: 20వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు
వజ్రకరూర్లో ప్రారంభమై కమలపాడు, గూళ్యపాలెం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లు
నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొనకొండ్ల వద్ద కర్నూలు జిల్లా మంత్రాలయం
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(టీడీపీ), గుంతకల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ
ఇన్చార్జి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి షర్మిలకు
ఘనస్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడాక.. గుంతకల్లు
సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల 7.40కి చేరుకున్నారు. 20వ రోజు
పాదయాత్రలో 12 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 258.80 కిలోమీటర్ల
పాదయాత్ర పూర్తయింది. యాత్రలో ఎమ్మెల్యేలు కాపు రాంచంద్రారెడ్డి,
గురునాథరెడ్డి, ఎన్.ప్రసన్నకుమార్రెడ్డి, నేతలు తోపుదుర్తి కవిత, పార్టీ
జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జి
వై.విశ్వేశ్వర్రెడ్డి, కిసాన్సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment